Monday, May 28, 2012

వెన్నెముక లేని ‘సంకీర్ణం’


ఏకపార్టీపాలనకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. కాబట్టి వాటి ప్రస్తావనకూడా అనవసరం. ఎందుకంటే  కేంద్రంలో  ఒకే పార్టీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించడం లేదు.  ఐతే ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వాల యుగం కొనసాగుతోంది. సంకీర్ణ ప్రభుత్వ పాలనంటే ప్రజలకు మహర్దశగా భావించొచ్చు.. కానీ వాస్తవంలో అది తారుమారైంది. ప్రజల పాలిట శనిలాగా తయారైంది. భావసారూప్యం గల పార్టీలన్నీ చేతులు కలిపి ఏర్పాటు చేసే ప్రభుత్వాన్నే సంకీర్ణ ప్రభుత్వం అంటున్నాం. ఇలాంటి పార్టీల వల్ల ప్రజలకు సుపరిపాలన అందాలి. కానీ.. ఖర్మ కొద్దీ మనం ఇప్పటి వరకూ చూసిన ఎన్డీఏ, యూపీఏ కూటములు వెన్నెముకలేని సంకీర్ణ ప్రభుత్వాలే. సంకీర్ణ ప్రభుత్వం తనకాళ్ళ మీద తాను నిలబడలేకపోతోంది. స్వతహాగా ఏనిర్ణయం తీసుకోవాలన్నా ధైర్యం చేయలేని పరిస్థితి. భాగస్వామ్య పక్షాల బెదిరింపులకు బెంబేలెత్తిపోయే దుస్థితి నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్య పక్షాలుగా చేతులు కలిపాగా పాలనా పరంగా ప్రతిఒక్కరూ సహాయ, సహకారాలు అందిస్తూ, పట్టు విడుపు ధోరణి వహించడం చాలా అవసరం.  అలా చేయకపోగా బ్లాక్‌మెయిలింగ్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు. ఈ దరిద్రం మనకు ఇప్పట్లో వదిలేలా లేదు.  మనకున్న ప్రధాన జాతీయ పార్టీల్లో, ఏపార్టీకి కూడా  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో మెజార్టీ సీట్లు వచ్చే పరిస్థితిలేదు. కాబట్టి అధికారం కోసం అండగా వచ్చే అడ్డమైన పార్టీలను కలుపుకుని తుమ్మితే ఊడే ముక్కులాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఒక సంస్కరణ అమలుచేయాలన్నా, ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలన్నా, రాష్ట్ర పతి అభ్యర్థిని ఎన్నుకోవాలన్నా భాగస్వామ్య పక్షాలదే పైచేయిగా నిలుస్తోంది. ఒకరు అవునంటే మరొకరు కాదంటారు. వీరిని బుజ్జగింజి దారికి తెచ్చుకునే సరికి తల ప్రాణం తోకకొస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల విషయంలో ఒకరు ముందుకు లాగితే మరొకరు వెనక్కు గుంజుతున్నారు. అడపాదడపా ధైర్యం చేసి సొంత నిర్ణయాలు తీసుకున్నా భాగస్వామ్య పక్షాలకు నచ్చకపోతే వాటిని వెనక్కి తీసుకోవడం తప్ప వేరేమి చేయలేని పరిస్థితి. మొన్నామధ్య భాగస్వామ్య పక్షం ఆగ్రహించడంతో ఏకంగా రైల్వే మంత్రినే మార్చేయాల్సి వచ్చింది. మన దేశంలో ౬౦ ఏళ్ళుగా పార్లమెంటరీ వ్యవస్థ నడుస్తోంది. ఇటీవల వజ్రోత్సవాలు కూడా  ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ వ్యవస్థను ఏఒక్కరూ తప్పుపట్టలేరు. కానీ చిక్కంతా వ్యక్తుల వల్లే వస్తోంది. స్వతంత్రం పొందాక ఇన్నేళ్ళ మన ప్రజాస్వామ్య పాలనలో ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీలేదు. పార్లమెంటులోగానీ, రాజ్యసభలోగానీ మన నేతలు వాకౌట్లు, వాగ్వాదాలు, నిరసనలు చేస్తూ సమయం, డబ్బు వృధా చేస్తూనే ఉన్నారు. ఏ ఒక్కరోజూ చట్టసభల్లో ప్రజకోసం సరైన చర్చలు జరపడం గానీ, నిర్ణయాలు తీసుకోవడంగానీ జరగడం లేదు.
 ఈ నేపథ్యంలో కూటమిగా జతకట్టే భాగస్వామ్య పక్షాలు ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని బాధ్యతా యుతంగా మెలగాల్సిన అవసరం చాలా ఉంది. ౧౯౯౬నుంచి ౨౦౦౪ వరకూ భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో సాగిన సంకీర్ణ పాలన, ౨౦౦౪ నుంచి ఇప్పటివరకూ కొనసాగుతున్న కాంగ్రెస్ సారథ్యంలోని సంకీర్ణ పాలనగానీ భాగస్వామ్య పక్షాలను కాదని సొంత నిర్ణయాలతో పాలన సాగించలేకపోవడం గమనార్హం.  ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు  పాలనా వ్యవస్థపై విరక్తికలిగే విధంగా నాయకులు ప్రవర్తిస్తే.. ఊహించని విప్లవాలకు దారి తీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. దీనికి పరిష్కారం కావాలంటే రాజకీయాల్లోకి కొత్తనీరు రావాలి.. చిత్తశుద్ధితో ప్రజాసేవకు అంకితమయ్యే నిస్వార్థ రాజకీయ నాయకులు పుట్టుకురావాల్సిందే.. అంతవరకూ సొంత కాళ్ళ మీద నిలబడలేని వెన్నెముక లేని సంకీర్ణ ప్రభుత్వాలను భరించడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు.

No comments:

Post a Comment