Saturday, June 30, 2012

‘కాలమ్.. జ్ఞానమ్’ కామెడీగా




‘కాలమ్’ కొద్దీ రాసే రచయితలున్నా.. రచనలకు ఇది అంతగా సరైన కాలం కాదు. ఎందుకంటే దిన పత్రికల్లోని శీర్షికలు చదవడానికే ఎవరికీ తీరిక లేని కాలం ఇది. అలాంటిది సీరియస్ రచనలనో.. జ్ఞానం కలిగించే రచనలనో చదివేవారు చాలా తక్కువ.  కొంతలో కొంత సంతృప్తికరం ఏంటంటే..  ‘వ్యంగ్యం’ అంటించి రాస్తే  సమయం, సరదా లేనివారు కూడా వదలకుండా చదివే  అవకాశం ఉంటుంది.  

శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానమ్ ఎంతటి ప్రాశస్త్యమైందో తెలిసిందే. అంత విస్తృతంగా కాకపోయినా అంతే ‘దూర’, ‘దివ్య’ దృష్టితో కామెడీ  కాలజ్ఞాన్ని రాశారు దురికి మోహన్ రావుగారు. ఆయన రాసిన కామెడీ కాలజ్ఞానం చదివిన వారెవ్వరికైనా ఆయన్ను ముద్దుగా శ్రీశ్రీశ్రీ  కలియుగ వీరబ్రహ్మాండ స్వామి అని పిలవాలనిపిస్తుంది. దురికి  మోహన్‌రావుగారు చాలా సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గానూ, కొన్నింటికి స్ట్రైట్‌గానూ పనిచేశారు. ఆయన గతంలో రాసిన ‘సన్నకారు ప్రేమికులు’  అప్పట్లో సంచలనం.  అమెరికా సంస్కృతి నేపథ్యంగా ఆంగ్లంలో రాసిన ఎక్స్ రే మ్యాన్ ఇప్పట్లో మరింత సంచలనం. ప్రపంచ వ్యాప్తంగా  పేరు మోగినరావ్ తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం.  ఈయన సాహిత్యంలో పలు ప్రక్రియల్లో కలంతిరిగిన రచయిత అనడంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు.  కామెడీ కాలజ్ఞానం అనే పేరు చూడగానే ఇదేదో చౌకబారు రచనేమో అనుకున్నా.. కానీ సార్థక నామధేయం అన్నట్లుగా ఈ పుస్తకానికి ఆపేరు అచ్చు గుద్దినట్లుగా సరిపోతుంది. కామెడీ అన్నదిపేరులోనే కాకుండా రచనల్లో కూడా చివరి దాకా  పడిపడి నవ్వుకునేలా చేస్తుంది.  సాక్షి ఆదివారం అనుబంధంలో  కాలమ్‌గా వచ్చిన ఈ రచనలు  భవిష్యత్ కాలాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. ఇకపోతే జ్ఞానం..  టెక్నాలజీ అభివృద్ధి చెందితే సమాజంలో, సంస్కృతిలో, వ్యక్తుల వ్యవహార శైలిలో ఎలాంటి మార్పులొస్తాయి అనే విషయాలను  పెద్దగా  చదువుకోని వారికి కూడా అర్థమయ్యేలా  దివ్యమైన దూరదృష్టితో రాశారు. ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ ‘ఆదిత్య ౩౬౯’  సినిమా గుర్తుకొచ్చింది. అందులో ఒక శాస్త్రవేత్త  కాలయంత్రం (టెమ్ మిషిన్) ను కనిపెడతాడు. దాని ద్వారా భూత, భవిష్యత్ కాలాల్లోకి ప్రయాణించ వచ్చు.  కృష్ణదేవరాయల కాలంలోకి వెళ్ళి రావచ్చు, ౨౦౫౦ సంవత్సరంలోకి ప్రయాణించవచ్చ్చు. ఐతే ఆదిత్య ౩౬౯కు కామెడీ కాలజ్ఞానికి చాలా తేడా ఉంది. ఆ సినిమా సీరియస్‌గానూ, ఉత్కంఠగానూ సాగితే.. ఈ రచన నవ్వుపుట్టేలా, ఆనందంగా.. ఆహ్లాదంగా చదివిస్తుంది.  ఇవన్నీ దురికిగారు మేథాశక్తితో ఊహించి (ఇమాజినేషన్)  రాసిన ఫిక్షన్ అయినా  ఏమాత్రం వాస్తవ దూరం కాదనిపిస్తుంది. ఉదా- ‘శ్మశానంలో ఇల్లు’ అన్న శీర్షికతో భవిష్యత్‌లో హైదరాబాద్‌లో జనావాసాలు ఎలా ఉంటాయో చూపించాడు.  ఈ విషయంలో అయితే ౨౦౫౦ వరకు కూడా అక్కర్లేదు, ఆ దృశ్యం ఇప్పుడే కనిపిస్తోంది. ఎక్కడంటారా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, రోడ్ నెం-౧౨కు వెళ్తే చాలు. సమాధుల దగ్గర ఇల్లు కట్టారో..? ఇళ్ళ దగ్గర సమాధులు కట్టారో..? తేల్చుకోవడం అంత తేలిక కాదు. అలాగే   ‘దేశ భాషలందు తెలుగు ‘లెస్సు’ అంటూ రాబోయే కాలంలో తెలుగుకు ఎలా తెగులు పడుతుందో అద్దంలో చూపినట్లు రాశాడు.  ఈ విషయంలో కూడా ౨౦౫౦ వరకూ అక్కర్లేదు ఇప్పటికే తెలుగు భాషకు పట్టాల్సినంత తెగులు పట్టేసింది. తియ్యటి తెలుగులో అమ్మా నాన్నా, అవ్వ తాత, అని పిలవాలన్నా, పిలుపించుకోవాలన్నా కూడా నా మోషీగా అనుకునే వారెందరో ఉన్నారు. అంతెందుకు ఇప్పటితరంలో ఒక్క ఐదు నిమిషాలు ఏ ఒక్క ఇంగ్లీషు పదంలేకుండా మాట్లాడమంటే  చాలా మందికి నోరు రాదు. అలాగని పూర్తిగా ఇంగ్లీషులో మాట్లాడమన్నా చేతకాదు. రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది పరిస్థితి.  ఉదాహరణకు.. ఒక ఆర్టీసి బస్సు మీద చూస్తే.. ప్రొద్దుటూరు అనే ఊరు పేరును ప్రోద్దుటూరు అని రాసుంది. ఇంకో వీధిలో చూస్తే ఇచ్చట ఊచ్చలు పోస్తే చేప్పుతో కొట్టబడను.   మన భాష, సంస్కృతి ఎంతగా అడుగంటి పోతున్నాయో తెలిపే మరో ఉదాహరణ. నేనో టివి ఛానెల్‌లో పనిచేస్తున్నప్పుడు ప్రముఖ రచయిత తనికెళ్ళ భరణి రాసిన పుస్తకం ‘పరికిణి’ కొన్నాను. అదే ఛానెల్‌లో పనిచేస్తున్న ఒకమ్మాయి చూసి అదేంపుస్తకం అనడిగితే, పరికిణి అని చెప్పాను అంటే ఏంటి అనడిగింది. ఆ ప్రశ్న వినగానే నాకు కోపం, ఆశ్చర్యం, జాలి, బాధ అన్నీ ఏకకాలంలోనే కలిగాయి. తెలుగమ్మాయి అయ్యుండీ పరికిణి అంటే తెలియనందుకే కోపం. ఆమె అమెరికాలో పెరిగిందీ కాదు, మహానగరంలో పుట్టిందీ కాదు. సాధారణ పట్టణం నుంచి ఉద్యోగం కోసం హైదరాబాదు వచ్చింది. రేపో మాపో పెళ్ళి కాబోయే  తెలుగమ్మాయికి పరికిణి అంటే తెలియనందుకు జాలి.  ఇవి చూడ్డానికి చిన్న విషయాలుగానే కనిపించొచ్చు కానీ.. ఇది ఊహించుకుంటే ఒక్కోసారి భయమేస్తుంది.
 నిజంగా ఈ పరిణామం ఎటు దారి తీస్తుందా అని.  తెలుగు నేలమీద, తెలుగు వారికి మాతృ భాషలో సంపూర్ణంగా రాయడం, మట్లాడ్డం రావడం లేదంటే ఇంతకంటే భాషా దౌర్భాగ్యం ఎక్కడా ఉండదు.  ౨౦౫౦లో  తెలుగు  భాషా మరెంత దరిద్రంగా తయారవతుందనేది దేశ భాషలందు తెలుగు ‘లెస్సు’  అనే శీర్శికన అద్భుతంగా రాశారు. అందులో ఒక చోట శోభనం రాత్రి ‘శృంగార నైషధం’ గ్రంథంలోని ఒక పద్యాన్ని పాడమని భర్త అడిగితే బదులుగా  అతని భార్య  చెప్పే సమాధానం ఇలా ఉంటుంది.. ‘నేను ఆ నేమ్ హియర్ చేయలేదు యార్, అయినా వాటీస్ దిస్ నాన్సెన్స్ పద్యాలు’ అంటుంది చిరాకుగా.  ఈ ఒక్క వాక్యంతోనే అర్థమవుతుంది మన భాష, సంస్కృతి ఏ స్థాయిలో ఉండబోతున్నాయో.. ఇకపోతే ఇంటి పనిమనుషుల గురించి రాసింది ఆలిండియా అంట్లు తోమే వాళ్ళ సంఘం. ఇప్పుడే నమ్మకంగా, చక్కగా పని చేసే మనుషులు దొరకడం కష్టసాధ్యంగా ఉంది. ఇక భవిష్యత్‌లో ఎలా ఉంటుందనేది చాలా బాగా రాశారు.  ఇలా చెప్పుకుంటూ పోతే దురికి గారు రాసిన పుస్తకమంత అవుతుంది. ఐనా ఒక్క మెతుకుతోనే తెలిసిపోతుంది కదా అన్నం ఉడికిందీ లేనిదీ.. అన్నింటి గురించి చెప్పడమెందుకు. ఐతే ఈ పుస్తకంలో కెవ్వున అరవడం, ఉలిక్కిపడడం, హీనంగా, ధీనంగా, హీనాతి హీనంగా, ధీనాతి ధీనంగా, గిర్రున బుర్ర తిరగడం వంటి పదాలు సందర్భానుసారంగానే అయినా పదేపదే రావడంతో కొద్దిగా విసుగు అనిపిస్తుంది. ఇది మినహా వేరే ఏ ఇబ్బందీ లేదు..
హెచ్చరిక- ఈ పుస్తకం పట్టుకోవడం వరకే మీ చేతుల్లో ఉంటుంది.. వదలడం మీ వల్ల కాదు.. పూర్తిగా చదివే వరకూ.  అంతేకాదండోయ్ వ్యంగ్యం వ్యసనం లాంటిది.. మిమ్మల్నే కాదు.. మీ చుట్టుపక్కల వారిని కూడా బానిసలుగా చేస్తుంది. నేను చెప్పాలనుకున్నది చెప్పాను.. తర్వాత మీ ఇష్టం..  -నవకలం

No comments:

Post a Comment